పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలి –ఖమ్మం సిపి సునీల్ దత్
పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలి
-ఖమ్మం సిపి సునీల్ దత్
కల్లూరు, శోధన న్యూస్ :
పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని ఖ మ్మం సిపి సునీల్ దత్ సూచించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. కల్లూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ రికార్డులు తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యక లాపాలపై నిఘా పెట్టాలని సూచించారు. సామజిక మాధ్యమాలలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే డ్రగ్స్ నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ తరహా నేరాలు ఎక్కువ నమోదవుతున్నాయో వాటి నియంత్రణకై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు ముమ్మరం చేయాలని, పాత నేరస్తులను తనిఖీ చేయాలని, వారి కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు. కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో రోల్ క్లారిటీ వుండాలని, అప్పగించిన భాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలన్నారు..ఈ కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ రఘు రూరల్ సీఐ , పట్టణ ఎస్ఐ షాకీర్ పోలీసులు పాల్గొన్నారు.