సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్దం కావాలి
సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్దం కావాలి
— వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, పెండింగ్ ఓటరు దరఖాస్తులు వంటి పలు అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ… రాబోయే పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో ఎన్నికల ప్రణాళిక తయారు చేసుకోవాలని, ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ ఏర్పాట్లు, ఈవీఎం యంత్రాలు, నామినేషన్ల ప్రక్రియ పోలింగ్ సిబ్బంది శిక్షణ, మొదలగు అన్ని అంశాలతో కూడిన ప్రణాళిక రూపొందించా లని అన్నారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని అన్నారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా మరణించిన వ్యక్తుల, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలి వెళ్లిన వారి ఓటు వివరాలు నిబంధనల ప్రకారం తొలగించాలని అన్నారు. ఓటరు జాబితాలో వచ్చే మార్పులపై ఎప్పటి కప్పుడు రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తూ వారికి సమాచారం అందించాలని, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశపు మినట్స్ కాపీలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. నూతన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, నూతనంగా మంజూరు చేసిన ఓటర్ కార్డు వివరాలను వెంటనే సంబంధిత ప్రింటర్లకు అందజేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల కమీషన్ ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలలో అమలు చేయాలని, దానికి తగిన విధంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన మేర పోలింగ్ సిబ్బంది సన్నద్ధం చేసుకోవాలని, ఇటీవల జరిగిన బదిలీల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే వివిధ బృందాల్లోని సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు.
ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించు కునేందుకు భారత ఎన్నికల కమిషన్ 85 సంవత్సరాల పైగా వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించిందని, దీనికోసం ప్రత్యేకంగా సంబంధిత ఓటర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఇంటి వద్ద ఓటు హక్కు కల్పించేందుకు ఏర్పాట్ల ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో దివ్యాంగులను మ్యాపింగ్ చేసి పోలింగ్ నాడు వారికి అవసరమైన రవాణా సదుపాయాలను కల్పించాలని, నామినేషన్ దాఖలు ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ టర్న్ ఔట్ పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్బులు ప్రారంభించి ఓటు ప్రాముఖ్యత గురించి వివరించాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఓటు ప్రాముఖ్యత ప్రజలకు చేరే విధంగా వినూత్న రీతిలో కార్యక్రమాలను అమలు చేయాలని, వివిధ వర్గాలకు చెందిన వారిని తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ అవగాహన కార్యక్రమాల గురించి ఎప్పటి కప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలో ప్రచారం కల్పించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, కొత్తగూడెం ఆర్డిఓ మధు, భద్రాచలం ఆర్డీవో దామోదర్, జడ్పీ సీఈవో ప్రసూన రాణి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, ఎలక్షన్ సెల్ సూపర్డెంట్ ధారా ప్రసాద్, కొత్తగూడెం తహసిల్దార్ పుల్లయ్య, భద్రాచలం తహసిల్దార్ శ్రీనివాస్, అశ్వరావుపేట తహసిల్దార్ కృష్ణ ప్రసాద్, పినపాక తహసిల్దార్ రాఘవరెడ్డి, ఇల్లందు తహసిల్దార్ రవి కుమార్, ఎలక్షన్ సెల్ సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.