సింగరేణి సీఎండీ బలరామ్ కు ఐఐఐఈ పెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ అవార్డు
సింగరేణి సీఎండీ బలరామ్ కు ఐఐఐఈ పెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ అవార్డు
సింగరేణి సంస్థ కూడా అత్యుత్తమ పనితీరు అవార్డు బహూ కరణ
ముస్సోరిలో జాతీయ స్థాయి సీఈవోల సమావేశంలో ప్రదానం
సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి ఎన్.బలరామ్ కు జాతీయస్థాయి ట్రిపుల్ ఐఇ (ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్) సంస్థ వారు ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ అవార్డు 2024 ను ప్రకటించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీలో శుక్రవారం రాత్రి జరిగిన 24వ జాతీయ స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ తరఫున డైరెక్టర్ (ఆపరేషన్స్, పర్సనల్ ఎన్.వి.కె.శ్రీనివాస్ ఈ అవార్డును స్వీకరించారు. ఎన్.బలరామ్ సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపునకు నిత్యం సమీక్షలు నిర్వహించారు. గనుల వారీగా లక్ష్యాల సాధనకు దిశా నిర్దేశం చేశారు.
పెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ అవార్డు
ఆయన చూపిన చొరవతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ తన చరిత్రలోనే అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గుఉత్పత్తిని, బొగ్గు రవాణాను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాదు 35,700 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఉత్పత్తి కన్నా అధికంగా సాధిస్తూ.. సరికొత్త రికార్డులు సృష్టించడంతో జాతీయ స్థాయిలో సింగరేణి మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ వారు ఆయనకు వ్యక్తిగతంగా పెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ అవార్డు -2024ను బహుకరించడం జరిగింది.
అద్భుతమైన పనితీరు
కంపెనీల విభాగంలో అద్భుతమైన పనితీరును కనపరిచిన కంపెనీగా సింగరేణికి పెర్ఫార్మెన్స్ ఎక్స్లెంట్ అవార్డును నిర్వాహకులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ నుండి జనరల్ మేనేజర్ (ఎం ఎస్) టి. సురేష్ బాబు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ఎన్ భాస్కర, డీజిఎం(ఐఈ) సిహెచ్ సీతారాంబాబు, ట్రిపుల్ ఐ ఈ గౌరవ కార్యదర్శి ఏవీవీ ప్రసాద్ రాజు పాల్గొన్నారు.
సమష్టి కృషి వల్లనే లక్ష్యాలు
సింగరేణి సంస్థ లోని ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషి వల్లనే లక్ష్యాలు సాధించగలిగామని, సింగరేణికి లభించిన అవార్డులు సింగరేణి సంస్థ ఉద్యోగులకు చెందుతాయని, ఈ స్ఫూర్తితో మరింతగా పనిచేస్తూ ఉన్నత లక్ష్యాలు సాధించాలని సి అండ్ ఎండీ ఎన్.బలరామ్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.