Police:నూతన చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి.
నూతన చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విపత్కర సమయాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
భారీవర్షాల కారణంగా ఇబ్బందులకు గురైన ప్రజలకు అండగా నిలిచిన తీరు ప్రశంసనీయమన్నారు.భవిష్యత్తులో కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అక్కడకు చేరుకొని ప్రజలకు అండగా ఉంటూ వారిలో ధైర్యాన్ని నింపుతూ పోలీస్ శాఖకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
కేసుల నమోదు,విచారణ విషయంలో ఏవైనా సందేహాలు తలెత్తితే ఉన్నతాధికారుల సలహాలు,సూచనలతో వాటిని నివృత్తి చేసుకోవాలని తెలిపారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు.ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి “క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్” ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.
చోరీ కేసుల్లో సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.ప్రస్తుతం పోలీస్ శాఖలో వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి దొంగతనం కేసుల్లో నేరస్తులను పట్టుకోవాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు.గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహారించాలని తెలిపారు.
గుట్కా,మట్కా,జూదం,బెట్టింగు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసుల నమోదు చేయాలని తెలిపారు.సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
రౌడీషీటర్లు ,పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.