Jal Shakti Abhiyan: భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం
భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం
భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ‘క్యాచ్ ద రైన్, వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్’ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ తెలిపారు. ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో జలశక్తి అభియాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో క్యాచ్ థ రైన్ వెన్ ఇట్ ఫాల్స్ అంశం పై కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తీసుకోవాల్సిన చర్యల పై సమావేశంలో చర్చించారు .
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ జల్ శక్తి అభియాన్ అనేది దేశంలో నీటి భద్రత నీటి సంరక్షణను నిర్ధారించే లక్ష్యంతో భారత ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమం.
నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం, నీటి సేకరణను ప్రోత్సహించడం, నీటి నిల్వ మరియు పంపిణీ కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యం జిల్లాలో ఉన్న నీటి వనరుల ట్యాంకుల సరిహద్దులో ఎలాంటి ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామాలలో సామూహిక ఇంకుడు గుంతలు నిర్మాణం, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణం, అటవీ పునరుద్ధరణ వంటివి చేపట్టాలని తెలిపారు. జిల్లాలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి జలశక్తి అభియాన్ క్యాచ్ థ రైన్ క్యాంపెయిన్ చేపట్టాలి అన్నారు. వర్షపు నీరు వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలలో అవగాహన పెంచాలని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు అమలు చెయ్యాలని తెలిపారు.
జల శక్తి అభియాన్ లో భాగంగా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ చర్యలు, వాటర్ షెడ్ల అభివృద్ధి, అడవుల పెంపకం, నీటి మేనేజ్మెంట్ చర్యలు విస్తృతంగా చేపట్టాలని అన్నారు. మహిళా సంఘాలు, ప్రజలను భాగస్వామ్యం చెయ్యాలని , గ్రామసభల ద్వారా గ్రామాలలో నీటి సంరక్షణ పనులను గుర్తించాలని పేర్కొన్నారు.