క్రీడలు జీవితంలో భాగం కావాలి: కలెక్టర్ జితేష్
క్రీడలు జీవితంలో భాగం కావాలి: కలెక్టర్ జితేష్
ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా మెడల్స్ సాధించడం కంటే ఆటలను ఆడుతూ ఆస్వాదించడంలో ఎంతో ఆనందం దాగి ఉంటుందని అన్నారు. సీఎం కప్ ద్వారా గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు రాణించి, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ ద్వారా బహుమతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించామని ఇందుకోసం అవసరమైన నిధులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు యువతను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్న అని చెప్పారు.
అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు ఆటలాడడం ద్వారా మనస్సుకు ఆరోగ్యకరమైన ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. సీఎం కప్ లో పాల్గొనే క్రీడాకారులకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ ప్రోత్సహించాలని సంబంధిత కోచ్ లకు సూచించారు.