అశ్వారావుపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం..
అశ్వారావుపేట ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం..
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అశ్వారావుపేట, మే-శోధన న్యూస్ :
అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పరకాల గండిలో రూ. 2.24 కోట్లతో అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంలో రూ. 3.10కోట్లతో, తిరుమలకుంటలో రూ. 3.15కోట్లతో, కావడిగుండ్లలో రూ. 2.24కోట్లతో, అశ్వారావుపేట పట్టణంలో రూ. 2.53కోట్లతో నూతనంగా చేపట్టబోయే 33/11 కెవి సబ్ స్టేషన్ ల శంకుస్థాపనకు, అదేవిధంగా రూ. 24.46కోట్ల అంచనా వ్యయంతో 33కెవి ఫీచర్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టే కార్యక్రమం అశ్వారావుపేట నియోజకవర్గంలోని పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అశ్వారావుపేట నియోజకవర్గం కొన్ని దశాబ్దాల కాలంగా వెనుకబడి ఉంది…అలాంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ధ్యేయం… అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి చొరవతో కరెంట్ వెలుగులు నింపేందుకు ఈ రోజు విద్యుత్ సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రతీ తండాకు, ప్రతీ గ్రామానికి నాణ్యమైన కరెంట్ తో పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఎనిమిదో అద్భుతం కాళేశ్వరం కడుతున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఐనప్పటికీ వాటన్నిటిని తట్టుకుని వారు చేసిన తప్పిదాలను సరిచేస్తూ ఎన్నికల్లో ఇచిన ప్రతీ హామీని నెరవేరుస్తూ వస్తున్నామన్నారు.
ఎవరికీ ఉపయోగపడని ధరణినీ పక్కన పెట్టి ప్రతీ ఒక్కరికీ ఉపయోగ పడేలా భూ భారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చామన్నారు. విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తున్నాం నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 50వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం. రాజీవ్ యువ వికాస్ పేరుతో త్వరలోనే ప్రతీ నిరుద్యోగికి ఉపాధి కల్పించేందుకు లోన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో కోళ్ల ఫారాల్లో, పాడుబడిన రైస్ మిల్లుల్లో ఉన్న గురుకులను పక్కన పెట్టీ ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయలతో గురుకులాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచామన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది… పేదవాడి కళ్లలో చిరునవ్వు చూడాలని కాస్త ఇబ్బందులు ఎదురు అయినా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం రైతుని రాజును చేశాం… రుణమాఫీని సక్రమంగా అమలు చేశాం, రైతు బంధు ఇచ్చాం. వర్షాకాలంలో సన్నాలకి బోనస్ ఇచ్చాం… యాసంగిలో కూడా ఇస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 8లక్షల 19వేల కోట్ల రూపాయలకు మన ప్రభుత్వం ప్రతీ నెల రూ. 6500 కోట్లు అస్సలు, మిత్తి కడుతూ వస్తున్నామన్నారు. – పేదవాడికి ఏది ముందు అవసరమో అది ఇస్తున్నామన్నారు. మొదటి విడతలో ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4.50లక్షల ఇళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఐటిడిఎ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కోటా కంటే ఎక్కువ ఇళ్లు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసింది గోరంత చెప్పుకున్నది కొండంత… మనం కొండంత చేసి గోరంత చెప్పుకుంటున్నామన్నారు. ఐ అండ్ పీఆర్ ద్వారా రూ. 1052కోట్ల రూపాయలను అసత్యపు ప్రచారానికి గత బీఆర్ఎస్ పాలకులు అక్రమంగా వినియోగించుకున్నారు. పదిహేను, పదహారు నెలల నుంచి ఏ విధమైన పాలనను మన ప్రభుత్వం అందిస్తుందో రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అదే విధమైన మంచి సుపరిపాలన అందిస్తారన్నారు.