ఎన్నికల వ్యయ నియమావళిని ఖచ్చితంగా పాటించాలి
ఎన్నికల వ్యయ నియమావళిని ఖచ్చితంగా పాటించాలి
-జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు లావణ్య
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఎన్నికల వ్యయ నియమావళిని ఖచ్చితంగా పాటించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు పి లావణ్య సూచించారు. ఎన్నికల వ్యయ నియంత్రణలో భాగంగా చర్ల–దుమ్ముగూడెం మండలాల్లో ఎన్నికల వ్యయ పరిశీలకులు లావణ్య,వ్యయ నోడల్ ఆఫీసర్ ఏ.వీ. రెడ్డి ఆదివారం పర్యటించారు. తొలుత వారు దుమ్ముగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి, పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, ఎన్నికల వ్యయ నమోదు రిజిస్టర్లు, షాడో రిజిస్టర్, రసీదులు, లావాదేవీల వివరాలను సమగ్రంగా పరిశీలించారు. వ్యయ పరిమితుల అమలు, పత్రాల నిర్వహణలో ఖచ్చితత్వం, పారదర్శక విధానాలపై సంబంధిత సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం చర్ల మండలంలో కూడా వ్యయ రికార్డులను పరిశీలించి, అనంతరం పోటీ చేస్తున్న అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థులు ఎన్నికల వ్యయ నియమావళిని కచ్చితంగా పాటించాలని, ప్రతి ఖర్చు లావాదేవీని తగిన ఆధారాలతో నమోదు చేయాలని, సమయానుసారంగా రిపోర్టులు సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అత్యంత ముఖ్యమని, ఏవైనా లోపాలు ఉన్న పక్షంలో తక్షణమే సరిదిద్దాలని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టీములు, ఎంపిడిఓ , సిబ్బంది సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు.


