రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 1-శోధన న్యూస్ :
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఐడీఓసి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కట్టుబాటుగా పాటించాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్బెల్ట్ వినియోగించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదనే అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో రోడ్డు భద్రతా సందేశాలతో కూడిన బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ సమర్థవంతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా ఆర్టిఏ అధికారి జోషి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మనోహర్, వెంకట పుల్లయ్య, తదితరులు, రవాణా శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


