సర్వే వివరాలు పకడ్బందీగా ఆన్లైన్ చేయాలి
సర్వే వివరాలు పకడ్బందీగా ఆన్లైన్ చేయాలి
జిల్లాలో ఈ నెల 9 నుంచి చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో స్వీకరించిన కుటుంబాల వివరాలను అత్యంత పకడ్బందీగా ఆన్లైన్ లో నమోదు చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై తగు సూచనలు చేశారు.
జిల్లాలో సర్వే విజయవంతంగా జరుగుతుందని, అదే తరహాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆన్లైన్ లో ప్రతి కుటుంబ వివరాలను నమోదు చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నామని చెప్పారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అత్యంత కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. కుటుంబాల వివరాలు అంశాల వారీగా ప్రత్యేక ఫార్మేట్ లో నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు.
అంశాల వారీగా ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఆన్లైన్ లో నమోదు చేయాల్సిన బాధ్యత ఆపరేటర్ల పై ఉందని అన్నారు. ఒక్కొక్క ఆపరేటర్ కు నిర్దేశించిన కుటుంబాల సంఖ్య ఆధారంగా ఆన్లైన్ లో వారి వివరాలను నమోదు చేస్తారని చెప్పారు. వివరాలను ఆన్లైన్ నమోదు ప్రక్రియను సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆన్లైన్ నమోదు ప్రక్రియ విషయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, మాస్టర్ ట్రైనీలు పాల్గొన్నారు.