రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పటిష్ట ప్రణాళిక
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పటిష్ట ప్రణాళిక : ఉపముఖ్యమంత్రి
ఖమ్మం : విద్యుత్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలనందిoచాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ అధికారులతో విద్యుత్ శాఖ పనితీరుపై, విద్యుత్ శాఖ సిఎండి వరుణ్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాబోయే కాలానికి అనుగుణంగా విద్యుత్ వినియోగం ఎంత ఉన్న అందించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గరిష్ట డిమాండ్ ఉన్న విద్యుత్ సరఫరా అందించామని ఆయన అన్నారు. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలు, వరదల సమయంలో అర్థరాత్రి సైతం లెక్క చేయకుండా నీళ్లల్లో పనిచేసిన ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగిని ఆభినందించారు. ఆపత్కాల సేవలు వేల కట్టలేవని ఆయన అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలకు స్పందించి, త్వరితగతిన పరిష్కరించాలని ఉపముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఉందని, ప్రభుత్వ దృష్టికి సమస్యలు ఉంటే తీసుకురావాలని అన్నారు.
రాబోయే భవిషత్తు ను దృష్టిలో పెట్టుకొని 2029-2030 వరకు గ్రీన్ ఎనర్జీ 20,000 మెగా వాట్ల ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక లను సిద్ధం చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతున్న దృష్ట్యా విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్ట పరచడానికి కావాల్సిన బడ్జెటును పెట్టుకొని ముందుకు పోతున్నామన్నారు. ట్రాన్స్ఫార్మర్ల పై లోడ్ భారం పడకుండా కావాల్సిన ట్రాన్స్ఫార్మలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గృహ జ్యోతి కి సంబంధించి 200 యూనిట్ ల లోపు వారికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఉమ్మడి ఖమ్మం సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు 26 లక్షల వినియోగదారులకు లబ్ది చేకూరిందని తెలిపారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని రైతులకు పంటతో పాటు పవర్ తో ఆదాయం వచ్చేలా వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ ప్లాంట్ లు పెడుతున్నామని పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ మోడల్ గ్రామంగా మధిర లోని సిరిపురం ను ఎంపిక చేయడం జరిగిందని, గ్రామంలోని ఇళ్లకు కూడా సోలార్ ప్యానల్స్ పెట్టి సోలరైజేషన్ గ్రామంగా తీర్చిద్దిద్దాలని అన్నారు. సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్ట్ క్రింద మధిర సిరిపురంతో పాటు, కొడంగల్, అచ్ఛంపేటల్లో కూడా సౌర విద్యుదీకరణ చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోవడానికి తలసరి ఆదాయం పెరగాలని అందుకు నాణ్యమైన కరెంట్ అందించడంలో కీలకమైన పాత్ర విద్యుత్ శాఖదని అన్నారు.