అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి
అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి
సత్తుపల్లి, శోధన న్యూస్ : స్వేచ్ఛ న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు సరిహద్దు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో సహకారం అందించుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. సోమవారం సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్టిఆర్, ఏలూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లి ఎన్నికలకు ఈ నెల 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు 10 వ తేదీ వరకు స్వీకరించబడతాయని తెలిపారు. ఈ నెల 30 తేదీన పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల్లో డబ్బు, మధ్యం ప్రలోభాలను నియంత్రించి ఓటర్లు స్వేచ్ఛగా న్యాయబద్దంగా తమ ఓటు హక్కును వినియోగించు కునేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని సత్తుపత్లి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా, సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాలు ఎన్టిఆర్ జిల్లాతో సరిహద్దులు కలిగి ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉండడంతో సరిహద్దు రాష్ట్రంలో నిల్వలు వుంచి అక్కడి నుండి తరిలించే నగదు, మధ్యం తరలించే అవకాశాలు ఉన్నాయన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని వేర్హౌస్లు, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లలో తనిఖీలు చేపట్టి నిల్వలపై చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు మండలాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అనుమానిత బ్యాంకు లావాదేవీలు, ఒక ఖాతా నుండి ఒకేరోజు పదికంటే ఎక్కువ ఖాతాలకు యుపిఐ ద్వారా నగదు బదిలీ, పెద్ద మొత్తంలో నగదు విత్ డ్రా పై పర్యవేక్షణ చేసి చర్యలు చేపట్టాలన్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలకు సి విజిల్ యాప్పై అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. అనంతరం ఖమ్మం పోలీసు కమీషనర్ విష్ణు యస్ వారియర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు 266 కిలోమీటర్ల నిడివితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు, ఎన్టిఆర్ జిల్లాల సరిహద్దు ఉందన్నారు. 12 మేజర్ రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు 24 గంటలు నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. సరిహద్దు రాష్ట్ర జిల్లాల అధికారులు అవసరం దృష్ట్యా ఎక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయాలో చేసి 24 గంటల నిఘా ఉంచాలన్నారు. పోలింగ్కు రెండు రోజుల ముందు సరిహద్దు గ్రామాల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, సోషల్ మీడియాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకోవాలనా ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులు ఒకరినొకరు తమ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని అప్రమత్తంగా విదులు నిర్వర్తించాలని కోరారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆoధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు, ఏఎస్ఆర్, చత్తిస్ఘడ్లోని సుఖుమా జిల్లాల సరిహద్దులు ఉన్నాయన్నారు. మద్యం రవాణాపై గట్టి నిఘా పెట్టాలన్నారు. అక్రమ మధ్యం చాలా తక్కువ సీజ్ అవుతున్నట్లు తెలుస్తుందని దీనిపై గట్టి నిఘా పెట్టాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ మాట్లాడుతూ చెక్పోస్టులలో తనిఖీల సమాచారం ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుందని తెలిపారు. అనంతరం ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ సరిహద్దు జిల్లాల సహకారానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఎస్టిలు ఏర్పాటు చేసి వాటికి తగినంత సిబ్బందిని నియమించి, ఏ రోజు సీజింగ్ వివరాలు ఆరోజు సమాచారం ఇస్తామన్నారు. యూపిఐ లావాదేవీలు, బ్యాంక్ లావాదేవిలు పర్యవేక్షణ చేస్తామన్నారు. సమస్యాత్మక రహదారులపై టిమ్లను ఏర్పాటు చేస్తామని, బాద్యతాయుతంగా నిబద్దతతో విధులు చేపట్టి సహకరిస్తామని అన్నారు. అనంతరం ఎన్టిఆర్ జిల్లా డిసిపి అజిత మాట్లాడుతూ, జిల్లాలో 12 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు ఏర్పాటు చేసామన్నారు. తెలంగాణాతో ఉన్న 239 కి.మి సరిహద్దులో 9 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 8 వందలకు పైగా వ్యక్తులను బైండోవర్ చేశామన్నారు. అంతర్ జిల్లాల అధికారులతో 20 కి పైగా సమావేశాలు నిర్వహించి అక్రమ మధ్యం అదుపుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్కు రెండు రోజుల ముందు నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏలూరు జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి మాట్లాడుతూ తెలంగాణతో ఏలూరు జిల్లాకు 11 సరిహద్దు గ్రామాలు ఉన్నాయన్నారు. 7 చెక్పోస్టులు పెట్టి 24 గంటల నిఘా చేపట్టామన్నారు. మద్యం, అనుమానిత నగదు లావాదేవిలపై నిఘా పెడతామన్నారు. ఏరోజుకు ఆరోజునివేదికలుఅందజేస్తామన్నారు.
ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డి మదుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ డిసిపి ప్రసాదరావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఎన్టిఆర్, ఏలూరు జిల్లాల రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, బ్యాంకింగ్, కోఆపరేటివ్, అధికారులు పాల్గొన్నారు.
