రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టిన బీఆర్ ఎస్-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టిన బీఆర్ ఎస్
-భవిష్యత్ కోసం ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతాం
-సమిష్టి కృషి తో లక్ష్యాల సాధించుకుందాం
-తెలంగాణ డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క
మణుగూరు, శోధన న్యూస్ : భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబద్దతో ప్రణాళికా బద్దంగా ముందుచూపుతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. శనివారం హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా మణుగూరు జూనియర్ కళాశాలకు చేరుకున్న ఆయన బిటిపిఎస్ విద్యుత్ ప్లాంటును సందర్శించి పరిశీలించారు. అనంతరం విద్యుతాశాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పరిశీలిస్తూ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే గత ప్రభుత్వం చేసిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా శ్వేతపత్రం విడుదల చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలతో విద్యుత్ రంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలిపారు. మనిషి మనుగడకు విద్యుత్ తో విడదీయరాని సంబంధం ఏర్పడిందని, లోతుగా అధ్యయనం చేస్తూ సమస్యలను అధిగమించి సమాజానికి మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ, పౌర సమాజ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నామన్నారు. పర్యావరణ సమస్య రాకుండా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాల్సి ఉండగా సబ్ క్రిటికల్ సాంకేతికతను వినియోగించడం వల్ల రా మెటీరియల్ ధరలు పెరగడంతో పాటు పర్యావరణ సమస్యలతో భారం పడినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హాయాంలో జరిగిన అంకెలు, సంఖ్యల సమాచారం చాలా ఆందోళన కరంగా ఉన్నట్లు తెలిపారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని, లెక్కలు చూస్తుంటే చాలా ఆందోళనకరంగా, ఆశ్చర్యంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి రూ.7259 కోట్లు మాత్రమే బకాయిలున్నాయని అన్నారు. కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో విద్యుత్ రంగం రూ.81516 కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అప్పులు తెచ్చారన్నారు. ప్రభుత్వం ద్వారా పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.28842 కోట్లు వెరసి మొత్తం రూ.1,10,358 కోట్లు అప్పులున్నట్లు తెలిపారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చామని చెప్పిన లెక్కలు చూస్తుంటే భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు కోసం 30406 కోట్లు రూపాయలు వెచ్చించారని, అలాగే సింగరేణికి కట్టాల్సిన విద్యుత్ బకాయిలు 19431 కోట్లు, జెన్కోకు 9743 కోట్లు, మొత్తం విద్యుత్ కొనుగోలు బకాయిలు 59580 ఉన్నట్లు తెలిపారు. పీకల్లోతు అప్పుల్లో ముంచిన రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్న సమస్యలను అదిగమిస్తూ ముందుకు సాగాలన్నారు. సమాజానికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం, వనరులను ప్రజలు అభివృద్ధికి వినియోగంచడానికి మనందరం కలిసి కట్టుగా ప్రణాళికా బద్దంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు విద్యుత్ ప్లాంటు యొక్క నిర్వహణతీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ఈ సమావేశంలో విద్యుత్ ప్రిన్సిపల్ సెకట్రరీ సయ్యద్ అలి ముర్తుజా రిజ్వి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి క్రిష్ణభాస్కర్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, వైరా శాసనసభ్యులు డాక్టర్ రాంచందర్నాయక్, మాజి శాసనసభ్యులు పోదెం వీరయ్య, భద్రాద్రి జిల్లా ఆడిషనల్ కలెక్టర్ డాక్టర్ రాంబాబు, జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్, సిఈలు పప్పుల రత్నాకర్, బిచ్చయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.