ప్రతి ఒక్క పోలీస్ అధికారికి కొత్త చట్టాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
ప్రతి ఒక్క పోలీస్ అధికారికి కొత్త చట్టాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
-దేశ వ్యాప్తంగా జూలై 1వ తేది నుండి అమలు కానున్న నూతన చట్టాలు
-నూతన చట్టాలపై జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి దశల వారీగా ముగిసిన శిక్షణా తరగతులు
– శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ప్రతి ఒక్క పోలీస్ అధికారికి కొత్త చట్టాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ఉమెన్స్ కళాశాల నందు నూతన చట్టాల గురించి ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ జులై ఒకటో తేదీ నుండి అమలులోకి రానున్న నూతన చట్టాల పట్ల ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో ప్రతి సబ్ డివిజన్లోని అధికారులు, సిబ్బందికి ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
జులై 1వ తేది నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,అందుకు అనుగుణంగా కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు.కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత(బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బిఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్యా అధినియం-2023 పూర్తి అవగాహన కలిగి ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలమని,కొత్త చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన రావాలంటే ప్రతి ఒక్కరిలో నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడే సాద్యం అవుతుందన్నారు.
కొత్త చట్టాల అమలు జరిగిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు. అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చాన్నారు. అరెస్ట్,వాంగ్మూలం నమోదు నందు పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తూ నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించవలసిన తీరు,తదితర అంశాలపై కొత్త చట్టాలలో మార్పుల గురించి వివరించారు.భారతన్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదనీ,అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాలను రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు.
నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు,విధి విధానాలు,విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని,ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు.అధికారులు,సిబ్బంది ప్రతి ఒక్కరూ కొత్త చట్టాలను నేర్చుకోవాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా ఈ నూతన చట్టాలపై పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడంలో సమన్వయాధికారిగా వ్యవహరించిన డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామీ, కొత్తగూడెం సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్షణకు సంభందించి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ని ఈ సందర్బంగా అభినందించారు.
అదేవిధంగా ఈ తరగతుల ద్వారా శిక్షణను అందించిన సిఐ ఇంద్రశేనారెడ్డి మరియు ఎస్సై రాణాప్రతాప్ లను ఎస్పీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, సిఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్,శివప్రసాద్, ఇంద్రశేనారెడ్డి, ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.