ఆపరేషన్ చేయూతతో సత్ఫలితాలు
ఆపరేషన్ చేయూతతో సత్ఫలితాలు
-నిషేధిత సిపిఐ మావోయిస్ట్ దళ సభ్యుల కుటుంబాలకు కౌన్సిలింగ్
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
చర్ల , శోధన న్యూస్ : ఆపరేషన్ చేయూతతో సత్ఫలితాలు చేకూరుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయూత ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ప్రజలను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకొని తమ ఉనికి కోసం,స్వార్ధ ప్రయోజనాల కోసం వారిచేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకొని అభివృద్ధి నిరోధకులుగా మావోయిస్టులు వ్యవహారిస్తున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు, కారణాల వలన కుటుంబాలను వదిలేసి తెలిసీ తెలియక మావోయిస్టు పార్టీలోకి వెళ్లి చాలామంది అమాయకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వారందరూ తిరిగి జనజీవన స్రవంతిలో కలవడానికి పోలీసు వారు వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందన్నారు. జిల్లా నుండి నిషేధిత సిపిఐ పార్టీలో పనిచేస్తున్న దళ సభ్యులంతా లొంగిపోయి ప్రభుత్వం నుంచి వారికి అందే అన్ని రకాల ప్రతిఫలాలను పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
-ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి స్పందించి నలుగురు దళ సభ్యుల లొంగుబాటు
ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి స్పందించి నలుగురు దళ సభ్యుల లొంగుపోయారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. చర్ల మండలం బూరుగుపాడుకి చెందిన వంజం దేవా, కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కాంపెల్లి రాజ్ కుమార్ అలియాస్ రంజిత్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లాకు, జేగురుగొండ మండలం తిమ్మాపూర్ కు చెందిన సోడి గంగా అలియాస్ అశోక్ , సుకుమా జిల్లా డోకుపాడు గ్రామానికి చెందిన కల్మ దేవే లు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక,మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల వేధింపులు తట్టుకోలేక శుక్రవారం పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగిందని తెలిపారు.
-గతంలో పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులకు రివార్డుల అందజేత
ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన దళసభ్యులైన
చర్ల మండలం ఎర్రం పాడు గ్రామానికి చెందిన మడివి కృష్ణ కు రూ. 4లక్షలు, గుండాల మండలం అడవి రామవరం గ్రామంకు చెందిన పూణేo ఆడమయ్య కి లక్ష రూపాయలు, సుకుమా జిల్లా పెంటపాడు గ్రామం చింతగుప్ప చెందిన వెట్టి బీమాకు లక్ష రూపాయల నగదును జిల్లా ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు.
-చర్ల పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ ను ప్రారభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
మేము సైతం కార్యక్రమంలో భాగంగా చర్ల మండలంలోని వ్యాపారస్తులు మరియు ప్రజలు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించేందుకు గాను సుమారుగా చర్ల పోలీసు వారికి రూ.9,50,000/-అందజేశారు.నేరాల నియంత్రణ కొరకు చర్ల మండలంలో మొత్తం 54 సీసి కెమెరాలను ఏర్పాటు చేసి చర్ల పోలీస్ స్టేషన్లో వీటికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేయడమైనది.ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఈ కమాన్ కంట్రోల్ ను ప్రారభించారు.నేరాల నియంత్రణలో భాగంగా తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో పాత్ర వహించిన చర్ల మండల వ్యాపారస్తులకు,ప్రజలకు ఈ సందర్బంగా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, సిఆర్ పిఎఫ్ 51 బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సునీల్ కుమార్,141బెటాలియన్ సిఆర్ పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్,చర్ల సిఐ రాజు వర్మ, దుమ్ముగూడెం సీఐ అశోక్ , ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్,రమేష్, అశోక్ రెడ్డి,ముత్యం రమేష్ , ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.