ప్రభుత్వరంగ, ప్రైవేట్ పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వరంగ, ప్రైవేట్ పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, మే శోధన న్యూస్ :
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వరంగ, ప్రైవేట్ పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పరిశ్రమల భద్రతాధికారులతో శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అశ్వాపురం భారజల ఉత్పత్తి కేంద్రం,సారపాక ఐటిసీ, కే టీపిఎస్,బిటీపిఎస్ మరియు ఎన్ఎవిఏ(నవ) లిమిటెడ్ కంపెనీల భద్రతాధికారులు, సంబంధిత పోలీసు అధికారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయా పరిశ్రమలు, కంపెనీలలో ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న నియమ నిబంధనలను పాటిస్తూ దానికనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు.అలారం సిస్టమ్ విధానాన్ని తమ కంపెనీల ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ చేయాలని తెలిపారు.తమ ప్రాంతాల్లోని ప్రతి ప్రదేశంలో సీసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.పరిశ్రమల,కంపెనీల ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద ఇతర వ్యక్తులు లోనికి ప్రవేశించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.అదేవిధంగా దొంగతనాలు జరగకుండా తమ వంతు నిఘా ఏర్పాటు చేసుకుని పోలీస్ వారికి సహకరించాలని కోరారు.తమ తమ పరిసర ప్రాంతాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.నిషేదిత మావోయిస్టుల కార్యకలాపాల పట్ల కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులకు సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని పరిశ్రమలు,కంపెనీల వద్ద గస్తీని ముమ్మరం చేయాలని సూచించారు.అత్యవసర సమయంలో ప్రజలు పాటించాల్సిన విషయాలపై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ సమావేశంలో భారజల కేంద్రం కమాండెంట్ అమిత్ కుమార్, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సీఐలు వెంకటేశ్వర్లు,అశోక్ రెడ్డి,ఐటిసీ సెక్యూరిటీ ఆఫీసర్ మనీష్ శర్మ, కేటీపిఎస్ అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్,బీటీపిఎస్ అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.