తెలంగాణహైదరాబాద్

నెలాఖరు లోగా గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలు  -తెలంగాణ సిఎం రేవంత్​ రెడ్డి

నెలాఖరు లోగా గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలు 

-తెలంగాణ సిఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, శోధన న్యూస్ : ఈ నెల ఆఖరు లోగా గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి  తెలిపారు. సిఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్​ సబ్​ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 27 లేదా 29వ తేదీన  గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు.  మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా, ఏజెన్సీలకు చెల్లించాలా? అనే విషయంపై చర్చించారు. గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. మరో విధానంలో లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూసేలా ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. తెల్లరేషన్‌కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తుల్లో కార్డునెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే సవరించుకునే అవకాశమివ్వాలని పేర్కొన్నారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మరోవైపు పురపాలక, ఆర్​డబ్యూఎస్ విభాగాలతోనూ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై అధికారులతో సీఎం చర్చించారు. వేసవికాలం దృష్ట్యా మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామాలలో ప్రత్యేకాధికారుల పాలన సాగిస్తున్న వేళ నీటిసరఫరాకు ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారుల ద్వారా పర్యవేక్షించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *