ఈపి ఆపరేటర్ ట్రైనీ పోస్టుల పెంపు
ఈపి ఆపరేటర్ ట్రైనీ పోస్టుల పెంపు
భద్రాద్రి కొత్తగూడెం/మణుగూరు, శోధన న్యూస్ : సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా లో ఖాళీగా ఉన్న ఈపి ఆపరేటర్ ట్రైనీ ( కేటగిరీ-5) పోస్టులను అంతర్గత అభ్యర్ధులతో భర్తీ చేయుటకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఉన్న 60 పోస్టులను 100 కు పెంచామని జిఎం(సెక్యూరిటీ) , జిఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ ఆర్సి (ఎఫ్ఏసి) బిఆర్ ధీక్షితులు శుక్రవారం తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ లో మణుగూరు ఏరియా లో పని చేయటానికి ఖాళీగా వున్న ఇ.పి. ఆపరేటర్ టైనీ( కేటగిరీ-5) ఉద్యోగాలను 60 పోస్టుల నుండి 100 పోస్టులకు పెంచామని, ఇప్పటికే ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈ నెల 18.06.2024 నుండి 21.06.2024 వరకు డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించామని తెలిపారు.ఈ డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో ఉత్తీర్ణులైన మొత్తం 828 అభ్యర్ధులకు జూన్ 30న సింగరేణి కాలరీస్ మహిళా డిగ్రీ & పి.జి. కళాశాల- కొత్తగూడెంలో వ్రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అసెస్మెంట్ మార్కులు, డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ పరీక్ష మార్కులు కలిపి, అభ్యర్థుల ఫైనల్ మార్కుల జాబితా అదే రోజు హెడ్ ఆఫీసు నోటిస్ బోర్డులో ఉంచుతామని తెలిపారు.
ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానిక అభ్యర్థులకు కేటాయించిన రిజర్వేషన్ అనుసరించి 100 ఈపి ఆపరేటర్ ట్రైనీ ( కేటగిరీ-5) పోస్టుల ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలన్నీ పూర్తిగా కంప్యూటర్ ద్వారా, మానవ ప్రమేయం ఏ మాత్రము లేకుండా, నిష్పక్షపాతంగానూ, చట్టబద్ధంగాను తగిన భద్రతా, విజిలెన్స్ ఏర్పాట్ల మధ్య పారదర్శకంగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులు మధ్య దళారుల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. కొంత మందిఉద్దేశ్యపూర్వకముగా సృష్టించే పుకార్లను నమ్మి అభ్యర్థులు అనవసరమైన అనుమానాలకు ఆందోళనలకు గురికావద్దన్నారు. ఎంపిక మొత్తము పూర్తిగా మెరిట్ ఆధారముగా నిర్వహించనున్నామన్నారు. ఈ ప్రక్రియలో ఎవరైనా దళారులు అభ్యర్థులను మోసం చేస్తుంటే వాటి ఆధారములతో కూడిన సమాచారము ఏదైనా లభించినచో, కంపెనీ ఉన్నతాధికారులకు గాని, విజిలెన్స్ అధికారులకు గాని తెలియజేసిన యెడల వెంటనే తగు చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు.