పోస్టల్ బ్యాలెట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి
పోస్టల్ బ్యాలెట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి
– వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని, వారికి పోస్టల్ బ్యాలెట్ అందే విధంగా సంబందిత అడికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యంపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఐ డి ఓ సి నుంచి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా , అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మరియు ఐ టీ డి ఏ పి ఓ ప్రతిక్ జైన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. పోలింగ్ సిబ్బంది ర్వాండమైజేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సదరు ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందించే దిశగా అవసరమైన మేర అదనపు ఫారం 12 లు సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించే సమయంలో అవసరమైన మేర కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఫారం 12 లు అందజేసి ఉద్యోగి ఆప్షన్ తీసుకోవాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది సమర్పించిన ఆప్షన్ ల ప్రకారం ఏ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అనే అంశం ఎస్ఎంఎస్ ద్వారా పంపడం జరుగుతుందని, ఓటు హక్కు వినియోగించు కోవడం కోసం ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి జిల్లాలో ఉద్యోగుల నుంచి ఫారం 12 తీసుకొని ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని కేటాయించాలని, ఆన్ లైన్ లో నమోదు చేసిన ఫారం 12 లు సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్తాయని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో మే 3న, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మే 4 నుంచి మే 8 వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు స్వీకరించాలని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి ఫారం 12 సమర్పించి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పొందవచ్చని తెలిపారు. భారత ఎన్నికల కమీషన్ అత్యవసర సేవలలో పాల్గొనే సిబ్బందికి సైతం ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందని అన్నారు. అత్యవసర సేవలలో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిటర్నింగ్ అధికారికి ఏప్రిల్ 23 లోపు ఫారం 12డి సమర్పించాలని, సదరు దరఖాస్తులను పరిశీలించి రిటర్నింగ్ అధికారి ఏప్రిల్ 24 నాడు ఆమోదించిన దరఖాస్తులకు ఎస్ఎంఎస్ ద్వారా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రంపై సమాచారం అందిస్తారని, మే 3 నుంచి మే 8 వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద వారి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు.
85 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజెన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమీషన్ ప్రవేశపెట్టిందని, ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించు కోవాలనుకునేవారు ఏప్రిల్ 23 లోపు ఫారం 12 డి సమర్పించాలని అన్నారు. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునే అర్హులను ఏప్రిల్ 25 నాటికి ఎంపిక చేస్తారని, ఏ.ఆర్.ఓ లు షెడ్యూల్ రూపొందించి బూత్ స్థాయి అధికారుల ద్వారా ఇంటికి వచ్చే షెడ్యూల్ సమాచారం ఓటర్లకు అందించడం జరుగుతుందని అన్నారు. మే 3 నుంచి మే 6 వరకు మొదటి దశ , మే 8న రెండవ దశ ఇంటి వద్ద పోలింగ్ పూర్తి చేయడం జరుగుతుందని, ఇంటి వద్ద పోలింగ్ కు వెళ్లే సమయంలో పోలింగ్ సిబ్బంది వీడియో గ్రాఫర్ తప్పనిసరిగా వెళ్తారని, రాజకీయ పార్టీలకు సైతం సమాచారం అందించడం జరుగుతుందని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ మే 1 ఒకటి 2 మరియు 3 తేదీలలో జరుగు ప్రెసెండింగ్ అధికారులు మరియు సహాయ ప్రెసెండింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసిందిగా ఏ ఆర్ ఓ లను ఆదేశించారు. శిక్షణకు హాజరు అయ్యే ప్రెసెండింగ్ అధికారులు మరియు సహాయ ప్రసంగం అధికారులు తప్పనిసరిగా ఎపిక్ కార్డులను తీసుకురావాలని తెలిపారు.జిల్లాలో ప్రతి శిక్షణ కేంద్రానికిఇన్చార్జిగా జిల్లా అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.ప్రతి అధికారి వారికి కేటాయించిన కేంద్రాలను తనిఖీ చేసిఅన్ని ఏర్పాట్లును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధి నిర్వహణ కారణంగా పోలింగ్ రోజు ఓటు వేసే అవకాశం లేని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్స్ సదుపాయం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ నిర్వర్తించేందుకు జిల్లాలో వినియోగించే ప్రతి సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 ఏళ్ళ వయస్సు గల వారు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకుంటే వారి ఇంటి వద్దకు పోలింగ్ అధికారులు వచ్చి ఓటు వేసే అవకాశం కల్పిస్తారని ఏ తేదీ ఏ సమయంలో వచ్చేది ముందుగానే సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్లు, ఇంటి వద్ద ఓటింగ్ పొందడానికి ఫారం 12 డీ లను రిటర్నింగ్ అధికారికి ఏప్రిల్ 23 లోపు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికలలో విధులు నిర్వహించే ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.