భద్రాద్రి రామయ్య ఆలయ మాస్టర్ ప్లాన్ పై మంత్రి తుమ్మల సమీక్ష
భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ పై మంత్రి తుమ్మల సమీక్ష
• భద్రాచలం రామాలయం మాడ వీధుల విస్తరణ ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలి
• దశల వారీగా మూడు ఏళ్ళలో విస్తరణ పనులు పూర్తి చేయాలి
• కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు
హైదరాబాద్, శోధన న్యూస్ :
భద్రాచలం రామాలయం మాడ వీధుల విస్తరణ పనులు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయాలని మంత్రి తుమ్మల తెలిపారు. బుధవారం హైదరాబాద్ సచివాలయం లో దేవాదాయ శాఖ కమీషనర్ హరీష్ తో ఆలయ విస్తరణ పనులు పై మంత్రి తుమ్మల చర్చించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయం నూతన శోభ సంతరించుకొనుందన్నారు. మార్చి 2026 లో శ్రీరామనవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షించారు. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు ముఖ్యమంత్రి ఆదేశాలతో రూ. 34 కోట్లు విడుదల చేయడం తో భూ సేకరణ పూర్తి చేయడం జరిగిందన్నారు.
ఆలయం విస్తరణ పనులు కోసం భూ సేకరణ పూర్తవడంతో ఆలయం మాడ వీధుల విస్తరణ పనులు, ప్రాకార నిర్మాణాలు చేపట్టాలని,ఆగమ శాస్త్రం ప్రకారం ఆర్కిటెక్ట్ ఇచ్చిన డిజైన్లు (మాస్టర్ ప్లాన్) ముఖ్య మంత్రి ఆమోదం తో ఫైనల్ చేసి పనులు మొదలు పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.భద్రాచలం రామాలయానికి పెరుగుతున్న భక్తుల సౌకర్యం కోసం ఆలయం విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రామాలయం మాడ వీధుల విస్తరణ పనులు దశల వారీగా మూడు ఏళ్ళలో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ కమీషనర్ హరీష్ కు మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు. ఆగమ పండితులు రూపొందించిన నమూనాల ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభించేలా మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ నమూనాల ప్రకారం అత్యద్భుతంగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి.
పుష్కర ఏర్పాట్లపై అన్నీ శాఖలతో సన్నాహక సమావేశం నిర్వహించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. కుంభమేళా తరహాలో భద్రాచలం లో పుష్కరాల ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. భద్రాచలం రామాలయం దర్శనానికి, గోదావరి నదిలో పుష్కర స్నానానికి లక్షలాది మంది భక్తులు వస్తారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్నానాల ఘాట్లు, వసతి కేంద్రాలు, మెడికల్ క్యాంప్ లు శానిటేషన్, తాగునీరు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా ఉండాలని కోట్లాది మంది భక్తులు మెచ్చేలా పుష్కరాల ఏర్పాట్లు చేయాలని ఎండోమెంట్ కమీషనర్ హరీష్ కు మంత్రి తుమ్మల సూచించారు.


