సీతారామ ఎత్తిపోతల పథకంతో రైతులకు పుష్కలంగ సాగునీరు
సీతారామ ఎత్తిపోతల పథకంతో రైతులకు పుష్కలంగ సాగునీరు
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
-సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ విజయవంతం
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ :ఈ ఆగస్టు మాసంలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు వద్ద పంప్ హౌస్ ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పంప్ హౌస్ ద్వారా 1500 క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 4 పంపుల ద్వారా 104 కిలో మీటర్లు నీటి సరఫరాకు ప్రధాన కాలువ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ కాలువకు ఏన్కూరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు అనుసంధానం చేయనున్నామని తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1.20 లక్షల ఎకరాలకు మొదటి విడతగా సాగునీటిని అందించనున్న ట్లు తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాలలో విడతల వారీగా సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలోని 6.74 లక్షల ఎకరాలకు పుష్కలంగ సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, సూపరిండెంట్ ఇంజనీర్లు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరియు కార్యనిర్వాహక ఇంజనీర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.