ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి
*పెండింగ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు పూర్తి చేయాలి
*విద్యార్థుల ఏకరూప దుస్తులు, పాఠ్యాంశ పుస్తకాల పంపిణీ పూర్తి
*సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
*పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి
*ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి
*జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐ డి ఓ సి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మరియు ఐటీడీఏ పీవో రాహుల్ లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వన మహోత్సవం, ప్రజాపాలన సహాయ కేంద్రాల నిర్వహణ, మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, వానా కాలం పంటల సాగు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలలో ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ, పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఉద్యోగుల సాధారణ బదిలీలు వంటి పలు అంశాలను సీఎస్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. వన మహోత్సవం కార్యక్రమం క్రింద నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. జిల్లాలలో పల్లె ప్రకృతి వనాలు, అర్భన్ పార్క్ లలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గతంలో నాటిన మొక్కలలో చనిపోయిన మొక్కలను రిప్లేస్ చేయాలని అన్నారు. ఇంటింటికి పంపిణీ చేసే మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, క్యాంటీన్లు, మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయు నూతన మీ సేవా కేంద్రాలలో వీలైనంత మేర మహిళా సంఘాల సభ్యులచే ఏర్పాటు చేయాలని, ఆసక్తి, అర్హత గల మహిళల గుర్తింపు, వారి శిక్షణ, బ్యాంకు లింకేజ్ రుణం వంటి అంశాలను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సిఎస్ అన్నారు. జిల్లాలో ప్రముఖమైన ప్రదేశాలలో మహిళా సంఘాలచే అమ్మ క్యాంటీన్ లను ఏర్పాటు చేయాలని, మహిళా శక్తి క్రింద ఇతర వినూత్న కార్యక్రమాలను అమలు చేసేందుకు సలహాలు, సూచనలు ఉంటే ప్రభుత్వానికి అందజేయాలని సిఎస్ తెలిపారు. స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని, ఆ రుణాలతో మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి చివరి దశ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సీఎస్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి రెండవ జత ఏక రూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను పంపిణీ పూర్తి చేయాలని అన్నారు.
వానాకాలం ప్రారంభమై వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటల సాగు పెరుగుతుందని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. విత్తనాల లభ్యత అంశాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని అన్నారు. రైతు భరోసా వర్క్ షాప్ లను పకడ్బందీగా నిర్వహించా లని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసుల వ్యాప్తి అరికట్టాలని, స్థానిక సంస్థల అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామాలు, పట్టణాలలో రెగ్యులర్ గా ఫాగింగ్ నిర్వహించాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని అన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తులను ప్రత్యేక శ్రద్దతో పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జిల్లా స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మంచినీటికై సంపులు నిర్మించాలని, వాటి ద్వారా వంటగదిపై ఉన్న సింటెక్స్ ట్యాంక్ లో నీరు నింపాలని, మంచినీటికై వేరే సింటెక్స్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని, పిల్లలు భోజనం అనంతరం చేతులు కడుక్కోవడానికి స్టీల్ బేసిన్లు ఏర్పాటు చేయాలని, వృధా నీరు ఇంకుడు గుంతల ద్వారా ఆదా చేయాలన్నారు. పాఠశాలలో మంచినీటి సదుపాయం, టాయిలెట్, రిపేర్సు, వంటగదిలో ఎత్తైన ప్రదేశంలో కూరగాయలు ఉంచాలన్నారు. దోమలు మరియు పాములు రాకుండా తలుపులు కిటికీలు రిపేరు చేయించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారితో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ వారు మీరు ఎక్కడ నిలువ కుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి శుక్రవారం మరియు మంగళవారం డ్రైడే పాటించాలన్నారు. జిల్లా వైద్య అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని 108 వాహనాలను వెంటనే సిద్ధపరచాలని, యుద్ధ ప్రాతిపదికన అన్ని రిపేర్లు చేయించాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు అందుబాటులో లేకపోతే అందుకు అధికారులే బాధ్యులని హెచ్చరించారు. డి సి హెచ్ వారి పరిధిలోని అన్ని జనరేటర్లు వెంటనే రిపేరు చేయించాలన్నారు. వర్షాకాలంలో కరెంటు కోత వల్ల ఆసుపత్రుల్లో అంధకారం ఉండరాదు అన్నారు. జనరేటర్ రిపేరుకు కావలసిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలన్నారు. తదుపరి టిసిఎంఎస్ వారి ద్వారా టెండర్లు పిలిపించి జిల్లాలోని అన్ని ఆసుపత్రిలో గల జనరేటర్లు రిపేర్ చేయిస్తామన్నారు.
ఈ సమావేశంలోడి ఆర్ డి ఓ విద్యా చందన, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, డిఎంహెచ్ఓ భాస్కర్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు , ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, డిడి ట్రైబల్ వెల్ఫే ర్ మణెమ్మ, ఈ ఈ పి ఆర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.