ఆర్టీసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
ఆర్టీసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
మణుగూరు, శోధన న్యూస్ : ఆర్టీసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మణుగూరు ఆర్టీసి డిపో జేఏసి నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మణుగూరు ఆర్టీసి డిపో జేఏసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 15వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆర్టీసి జేఏసి నాయకులు మాట్లాడుతూ…మణుగూరు-గోదావరిఖని సర్వీస్ను కండక్టర్తో నడిచే ఎక్స్ప్రెస్ సర్వీస్ పునరుద్ధరించాలన్నారు. గతంలో రెండు ఎక్స్ ప్రెస్ సర్వీసులు వందశాతం పైగా ఓఆర్ సాధించి డిపోకు లాభాలు తెచ్చాయన్నారు. సూపర్ లగ్జరీ బస్సులు సింగిల్ డైవర్తో నడపడం వల్ల ఓఆర్, ఈపికెలు పడిపోయాయన్నారు. మహాలక్ష్మీ పథకం వల్ల డ్రైవర్లు, కండక్టర్లు శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నారు.
చాట్ బుకింగ్ ఎడిసి కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో డిఎం కి ఫిర్యాదు చేస్తే కొత్త ఏడీసీలు వచ్చిన తర్వాత మారుస్తామని చెప్పి ఆరు నెలలు గడిచినా నేటివరకు మార్చలేదన్నారు. ఒకపక్క దేశ,రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు కోల్పోతున్న సింగిల్ డ్రైవర్ పోవాల్సిందేనని డిపో డిఎం డ్రైవర్ ను ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ సమస్యలు సిబ్బంది భద్రత, ఆరోగ్యం, ప్రయాణికుల సేవా ప్రమాణాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని, యాజమాన్యం వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే కార్మికుల సౌకర్యార్ధం డిపోలో విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. డిపో ఆవరణలో విశ్రాంతి గది పరిస్థితి దారుణంగా ఉందని, వెంటనే మరమ్మత్తులు చేపట్టి సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఇప్పటికైనా ఆర్టీసి యాజమాన్యం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు ఎస్ కే పాషా, పి శేఖర్, సిహెచ్ లింగయ్య, సిఎల్ కాంత్, కే వెంకటేశ్వర్లు, ఎన్ జిఆర్ తదితరులు పాల్గొన్నారు.


