ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
-అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి
సిద్దిపేట, శోధన న్యూస్: నవంబర్ నెల 30న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశానుసారం బుధవారం రోజున జిల్లా పరిధిలోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ చేరాలు, చిన్నకోడూర్ ఎస్ఐ సుభాష్ గౌడ్, కేంద్ర బలగాలు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ఆర్ఆర్ రాథోరో మరియు వారి సిబ్బంది, పోలీస్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపి మాట్లాడుతూ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కునువినియోగించుకోవాలని సూచించారు. ఓటు వజ్రాయుధమని, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని అన్నారు. ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 లేదా డయల్ 100 కాల్ చేయాలని సూచించారు. మద్యానికి, డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, మీకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా ,నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల ప్రణాళికలు తయారు చేయడం జరిగినది, పోలింగ్ జరిగే రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుంది. గ్రామాలలో ఏ పార్టీ వారు వచ్చి ప్రచారం చేసిన అడ్డుకోవద్దని ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చని మీకు నచ్చిన మెచ్చిన వ్యక్తికి ఓటు వేయండి కానీ ప్రచారాన్ని మాత్రం అడ్డుకోవద్దని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారామిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపినారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశ పెట్టిన సీ-విజిల్ యాప్ తో ఎన్నికల పోటీచేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వెయ్యమని ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన, డబ్బులు ఆశ చూపి ప్రలోభ పెట్టినా, మద్యం డబ్బులు ఓటర్లకు సరఫరా చేసిన, ఎలాంటి నేరపూరిత చర్యలకు దిగిన, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన, అల్లర్లు, గొడవలకు పాల్పడిన వెంటనే గ్రామాల ప్రజలు యువకులు స్పందించి ఈ యాప్ మొబైల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదుదారులు సంబంధిత వీడియోలు, ఫోటోలు, తీసి యాప్ లో అప్లోడ్ చేసినచో ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని అన్నారు. గ్రామాలలోని ప్రజలు యువకులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఈ యాప్ ఎన్నికలకు సంబంధించిన యాప్ తెలిపారు.