జిల్లా ఎన్నికల అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేయాలి
జిల్లా ఎన్నికల అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేయాలి
– కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితేష్ వ్యాస్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితేష్ వ్యాస్ తెలిపారు. సోమవారం ఢిల్లీ నుండి పోలింగ్ సన్నద్ధతపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల అవుతుందని, నవంబర్ 3 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు అన్ని అర్ ఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు సమయపాలన పాటించాలని చెప్పారు. ప్రతి నామినేషన్ ఆన్ లైన్ యాప్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న గుర్తులను మాత్రమే కేటాయించాలని అన్నారు.
నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత అవసరమైన బ్యాలెట్ పేపర్ల తయారీ, బ్యాలెట్ యూనిట్లు, పోస్టల్ బ్యాలెట్స్ సిద్దం చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలని , అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలని, ఈవిఎం యంత్రాల భద్రపరిచే స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. ఈవీఎం యంత్రాలు తరలించే సెక్టార్ అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతుల కల్పన పై శ్రద్ధ వహించాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది, మీడియా ప్రతినిధుల, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తు.చ. తప్పక అమలు చేయాలని, సి విజల్ యాప్ వినియోగంపై ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు. ఎన్నికల మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలని అన్నారు. రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని అన్నారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. తనిఖీలలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ ప్రతి రోజు వచ్చే సీజర్స్ పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, 10 లక్షల కంటే అధికంగా నగదు పట్టుకుంటే ఐటి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల విధులు నిష్పక్షిపాతంగా నిబంధనల మేరకు నిర్వహించాలని, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరగాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన పాటించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల, ఎస్పి వినీత్, ఐటిడిఎ పిఓ ప్రతీక్ జైన్, ఎఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ రాంబాబు, సీజర్స్ కమిటీ అధికారులు మధుసూదన్ రాజు, ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.